రూ. 600 కోట్లతో ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమ

నాయుడుపేట, ఫిబ్రవరి 23: నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌లలో రూ. 600కోట్లతో ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, ఈ పరిశ్రమ ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తైవాన్‌కు చెందిన గ్రీన్‌టెక్ జనరల్ మేనేజర్ మెక్యూ తెలిపారు. మంగళవారం కోనేటిరాజుపాలెంలో గ్రీన్‌టెక్ పరిశ్రమ ఏర్పాటుకు వాతావరణ కాలుష్యంపై రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈసందర్భంగా ఆ పరిశ్రమకు చెందిన అధికారి ప్రతినిధి మెక్యూ మాట్లాడుతూ తైవాన్ దేశంలో మైకోగ్రూపునకు చెందిన ఈ పరిశ్రమ ప్రపంచంలో ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ తయారీలో 35శాతం షేర్లు ఉన్నాయని, భారతదేశంలో ఆటోమొబైల్స్‌కు గిరాకీ ఉండటంతో ఈ పరిశ్రమ రాష్ట్రంలో ఈప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈగ్రూపునకు చెందిన పరిశ్రమలు ప్రపంచంలోని చైనా, తైవాన్, ఫ్రాన్స్ దేశాలలో ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వలన మొదటి విడతగా 2500మందికి ఉద్యోగాలు, రెండోవిడతగా నిరక్షరాస్యులకు ఉపాధి కల్పిస్తూ, స్థానికులు మరో 2500 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. వాతావరణ కాలుష్యంపై కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి అవసరమైనందున ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు, ఈ నివేదికలను భారత పర్యావరణ శాఖకు పంపి అక్కడ కమిటీ ద్వారా విచారించిన తరువాతే పరిశ్రమకు అనుమతి వస్తుందన్నారు. ఈపరిశ్రమకు కేటాయించిన భూముల్లోని గ్రామాలకు రూ. 10కోట్లతో రోడ్లు, పాఠశాలలు, తాగునీటి తదితర వౌలిక వసతులకు సంస్థ ముందుగానే పెద్దమొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు సెజ్ ప్రాంతంలోని గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని, ఈ ప్రాంతంలోని గ్రామస్తులకు ఎలాంటి హానీ జరగదని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమకు చెందిన నమూనా, విస్తీర్ణం తైవాన్‌లో ఈపరిశ్రమకు చెందిన స్పేర్‌పార్ట్స్ తయారీ విధానాన్ని టివి స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు.

http://www.andhrabhoomi.net/sri-pottisriramulu/automibile-660