రూ. 1000 కోట్లతో నగరాభివృద్ధి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రానున్న దాదాపు 1000 కోట్లతో నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అధునాతన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక పొదలకూరురోడ్డు నీళ్ల ట్యాంక్ వద్ద రూ. 1.34 కోట్లతో నిర్మించిన మంచినీటి పైపులైన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం చేపల మార్కెట్ వద్ద రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా పొదలకూరురోడ్డు వద్ద నిర్మించిన పైపులైన్ నిర్మాణం వలన 27వ డివిజన్ నుండి 33వ డివిజన్ వరకు 7 డివిజన్‌లలో తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా అందించనున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రజలకు 24 గంటలు పూర్తిగా తాగునీరు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా 102 కోట్ల వ్యయంతో ఇందిరా జలాశయ నిర్మాణం శంకుస్థాపన జరిగిందని, ఆ పనులను చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని పైపులైన్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు దాదాపు 120 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని, ఆ నిధులను సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కొత్తగా మంజూరు చేసిన ఆరు రిజర్వాయర్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రక్రియకు ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూర్చేందుకు ముఖ్యమంత్రికి తగిన ప్రతిపాదనలు పంపి ఆమోదం తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రూ. 450 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్ల నిర్మాణాలను చేపడుతున్నామని, ఈ పనులను ఆరు మాసాలలో పూర్తి చేసేలా ప్రణాళికలు తయారుచేయాలన్నారు. రూ. 100 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను, రూ. 150 కోట్లతో ప్లైఓవర్ వంతెన నిర్మాణాలను చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. గూడూరు, వెంకటగిరి మున్సిపాల్టీలలో తాగునీటి సమస్య లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణాలను చేపడతామన్నారు. పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా అందించుటలో అందరు భాగస్వాములై సంబంధిత పనులను సజావుగా నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. చేపల మార్కెట్ వద్ద నిర్మించనున్న ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణం పూర్తయితే చేపలు అమ్ముకొనే వారికి అవసరమైన వౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెచ్చించి త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ముత్తుకూరు వద్ద అదనంగా చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు దాదాపు 15 లక్షలతో స్థల సేకరణ చేశారని, నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనితో చేపలు అమ్ముకుని జీవించే వారికి అవసరమైన అధునాతన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీ ముస్లింలకు ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, దీనిలో ఎలాంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రోశయ్య నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని, కార్యక్రమంలో ఐకెపి మహిళలకు పావలావడ్డీ రుణాలను అందిస్తారని చెప్పారు. అలాగే తెల్లకార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కు సంబంధించి దాదాపు 21 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను, ఆదాయపన్నులు వసూలు కావల్సి ఉండగా 8.76 కోట్ల రూపాయలు వసూలైందని, ముఖ్యమంత్రి ఆదాయ పన్ను వసూళ్లల్లో 2 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చిన తదుపరి మార్చి 26 నుండి 31లోపు దాదాపు 5.24 కోట్ల రూపాయలు జమ చేశారని, మిగిలిన 7 కోట్ల రూపాయలు త్వరితగతిన నెల్లూరు కార్పొరేషన్‌కు చెల్లించి నగర పురోభివృద్ధికి భాగస్వాములు కావాలన్నారు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల్లూరు నగర అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు. అందులో భాగంగా పొదలకూరురోడ్డు వద్ద నిర్మించిన 5.4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన పైపుల నిర్మాణం వలన ఈ ప్రాంత ప్రజలకు ఒక్కొక్కరికి దాదాపు 105 లీటర్ల చొప్పున మంచినీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. అలాగే చేపలు అమ్ముకొనే వారికి వీలుగా ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణంతో వారికి అధునిక వసతులతో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరికి చేపలు అమ్ముకోవడే కాకుండా మిగిలిన చేపలను స్టోరేజ్ చేసేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్ గదిని, డ్రస్సింగ్ చేసేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనితో చేపలు అమ్ముకొనే వారు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేపలు అమ్ముకొనే వారు సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలన్నారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ఎన్ భానుశ్రీ అధ్యక్షత వహించి నగర అభివృద్ధికి అమలు చేస్తున్న పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరురూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ కె రాంగోపాల్, ఎస్‌పి ఇ దామోదర్, కార్పొరేటర్ సందాని భాష, మున్సిపల్ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు, అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

http://www.andhrabhoomi.net/category/channel/district/sri-pottisriramulu