ప్రగతి పథంలో జిల్లా

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. 64వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందన్నారు. ఆయా శాఖల పరిధిలో సాధించిన ప్రగతిని గణాంకాలతో వివరించారు. జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇప్పటికే 1157. 41 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయిన 50 పరిశ్రమల ద్వారా 11, 916 మందికి ఉపాధి లభించిందన్నారు. 79, 487 కోట్లతో ఏర్పాటు చేసే 19 మెగా పరిశ్రమలు, ఐదు ఎస్‌ఇ జెడ్‌లతో 1. 29 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. మాంబట్టు పారిశ్రామిక పార్కులో ఫుట్ వేర్ పరిశ్రమ, పవన్ విద్యుత్ తయారీ యంత్ర పరిశ్రమ, భారీ ప్లేట్స్ అండ్ వెసల్సు, లేజర్ టెక్నాలజీ సొల్యూషన్స్, కాయిల్ బెడ్స్, ఔషధాలు, సాక్స్ తయారీ పరిశ్రమలు ప్రగతి పథంలో ముందుకు వెళుతున్నాయన్నారు. 4. 19 లక్షల రైతు కుటుంబాలు ఉన్న జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 78 హెక్టార్లకు గాను రికార్డు స్థాయిలో 89 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేదన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 50 శాతం సబ్సిడీతో 1. 28కోట్ల రాయితీతో భారీ యంత్రాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. బ్యాంకుల రుణ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రధాన్యత కల్పించామన్నారు. ప్రాధాన్యతా రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వ్యవసాయం, చిన్న పెద్దా పరిశ్రమలు,

గృహ నిర్మాణం, విద్యా రుణాలకు 1, 845 కోట్ల లక్ష్యానికి గాను 1, 902 కోట్లు ఇచ్చారన్నారు. డిసిసిబి రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు 1, 876 కోట్లు కేటాయించగా అందులో 1, 432 కోట్లు వ్యవసాయ రంగానికే అందించారన్నారు. రబీలో సాగు విస్తేర్ణం భారీగా పెరిగిందన్నారు. ఉద్యాన వన శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో వివిధ రకాల పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లిస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 శాతం రాయితీతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వంద శాతం రాయితీతో ఉద్యాన వనాల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరేళ్ల నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా అమలు చేస్తున్నామన్నారు. జలయజ్ఞం కార్యక్రమం కింద సంగం, నెల్లూరు బ్యారేజ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పెన్నా డెల్టా ఆధునీకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డిసెంబర్ 2010 నాటికి తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి కెనాల్ నిర్మాణానికి సంబంధించి 551 ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 3, 514 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందిరమ్మ పథకం కింద 2, 37, 109 గృహాల నిర్మాణం చేపట్టగా 1, 26, 179 గృహాలు పూర్తి చేసి రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 4, 46, 271 జాబ్ కార్డులు జారీ చేసి 1, 91, 163 కుంటుబాల్లోని 3, 34, 072 మందికి కోటి 23 లక్షల పనిదినాలు కల్పించడానికి 112 కోట్లు ఖర్చు చేశామన్నారు. భూమి అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయన్నారు. సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం, సమగ్రత రక్షిత మంచినీటి పథకం, జలమణి, సంపూర్ణ పారిశుద్ధ్య పథకం, నెల్లూరు, వెంకటగిరి, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రత్యేకంగా నెల్లూరు కార్పొరేషన్‌లో అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయన్నారు. జిల్లాలోని మేజర్ పంచాయితీలుగా ఉన్న ఆత్మకూరు, నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం, సూళ్ళూరుపేటలకు మునిసిపల్ ప్రతిపత్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కె రామ్‌గోపాల్ తదితరులు పాల్గోన్నారు.